Wednesday, September 23, 2009

బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు కొత్త శకం కోసం పిలుపునిచ్చా

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తొలిసారి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు కొత్త శకం కోసం పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించని కొత్త శకం రావాలని ఆకాక్షించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను అమెరికా ఒక్కటే పరిష్కరించలేదని స్పష్టం చేశారు.

ప్రపంచమంతా సరికొత్త శకం దిశగా ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అధికారంతో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించే పరిస్థితిలేని కొత్త శకం ఆవిష్కృతం కావాలని, ఇందుకు ఇప్పటి నుంచే పని చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల చేతిలోకి అణ్వాయుధాలు చేరకుండా ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సమగ్ర అణు పరీక్షల నిరోధక ఒప్పందం (సీటీబీటీ) ఆమోదంపై ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. అణు పరీక్షలపై శాశ్వత నిషేధం అమల్లోయ్యేందుకు కృషి చేస్తామన్నారు. ఒకదేశంపై మరొక దేశం అధిపత్యం సాధించకూడని కొత్త శకాన్ని, భవిష్యత్తును అమెరికా కోరుకుంటోంది. భద్రతా, సంక్షేమం తదితర అంశాల్లో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలన్నారు.

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని, దాని ఆటలు సాగనివ్వమని ఒబామా చెప్పారు. ఇరాన్, ఉత్తర కొరియాలు అణు కార్యక్రమాల విషయంలో ముందుకెళ్లాలనుకుంటే, దీనికి వారే జవాబుదారీగా ఉండాలని చెప్పారు. ఇరాన్‌తో చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. అయితే అమెరికా సహనం అపరిమితం కాదని బరాక్ ఒబామా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



No comments:

Post a Comment