ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్లో సంక్షోభం నెలకొన్న విషయం తెల్సిందే. దీన్ని నివృత్తి చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం హడావుడిగా ముఖ్యమంత్రి పగ్గాలను సీనియర్ నేత కొణిజేటి రోశయ్యకు అప్పగించడమే కాకుండా, మరో ఏడాది వరకు ఆయననే కొనసాగించాలనే నిర్ణయానికి కూడా వచ్చింది. దీంతో జగన్ వర్గీయులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకు ఇడుపులపాయ ఎస్టేట్కు జగన్ మకాం మార్చి, అక్కడ తగిన వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. ఆయన అనుచరులు మాత్రం జగన్కు సీఎం బాధ్యతలు అప్పగించాలని బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. వీటికి చెక్ పెట్టి పరిస్థితిని తమ "హస్తం" దాటిపోకుండా చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం చూస్తోంది.
దీంతో సహనం కోల్పోయిన జగన్.. కాంగ్రెస్ను చీల్చి పీఆర్పీ అధినేత చిరంజీవి సహకారంతో సీఎం పీఠాన్ని అధిరోహించాలని తహతహలాడుతున్నారు. తదనుగుణంగా జగన్ వ్యూహాన్ని మార్చినట్టు సమాచారం. అంతేకాకుండా, వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు చిరంజీవి సైతం సానుకూలత వ్యక్తం చేసినట్టు వినికిడి. ప్రరాపాకు ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న 157 మంది ఎమ్మెల్యేలలో 140 మందికి పైగా జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. అందువల్ల చిరు మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని వైఎస్ జగన్ చేపట్టేందుకు అండర్గ్రౌండ్ వర్క్ బాగానే జరుగుతున్నట్టు వైఎస్జె సన్నిహితులు చెపుతున్నారు.
ఏది ఏమైనా.. వైఎస్సార్ మృతితో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వేగంగానే చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ వర్గీయులు నిపురుగప్పిన నిప్పులా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే మాత్రం భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ చీలిక తప్పదేమోనన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది
No comments:
Post a Comment