Sunday, September 27, 2009

రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చురగిలింది

రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చురగిలింది. కాంగ్రెస్ వర్గాల్లో ఈ మార్పులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఒకవైపు జగన్ అనుకూలురు, మరో వైపు జగన్ వ్యతిరేకులు.... ఇరు శిబిరాల మధ్య వర్గపోరాటం మొదలైంది. సోనియా ఫ్లెక్సీ చించివేయడం, బస్సులకు నిప్పంటించటం, పార్టీ కార్యాలయాలకు తాళాలు వేయడం వంటి పరిణామాలతో... రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటిదాకా జగన్ కు పరిస్థితి అనుకూలంగా ఉందనే ఏకపక్ష భావన చెదిరిపోయింది. వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న వారి సంఖ్య పెరిగింది. నిన్న మొన్నటి వరకూ నోరుమెదపని వారూ ఇప్పుడు తెరముందుకు వస్తున్నారు. ఒక్కొక్కరుగా ఒక్కటవుతున్నారు. అధిష్ఠానం అందిస్తున్న అండదండలతో విజృంభిస్తున్నారు. వీరందరి చేతిలో...సోనియా బొమ్మ ప్రధాన అస్త్రంగా మారింది. తాజా పరిణామాలతో జగన్ వర్గం ఆత్మరక్షణలో పడింది. సోనియా ఫ్లెక్సీ చించివేతపై జగన్ స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. జగన్ ను సీఎం చేయాలంటూ కార్యకర్తలు సోనియా ఫొటోను చించివేయడంపై ఆవేదన, ఆగ్రహం, ఆక్రోశం కలగలసిన స్వరాలతో... సోనియా ఫొటోనే చించేస్తారా? వైఎస్సే సర్వస్వమనుకుంటున్నారా? సోనియా లేకుండా ఆయన గెలిచేవారా? సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు... పార్టీలో ఉండటానికి అనర్హులు. బయటికి వెళ్లిపోండి అంటూ హెచ్చరికలు జగన్ చేయాల్సి వచ్చింది.
పార్టీ నేతలు కాకా, కేకే, వీహెచ్, హర్షకుమార్, మధు యాష్కీ, రేణుకా చౌదరి తదితర నేతలు ఒక్కసారిగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ చీఫ్ డీఎస్ లు సైతం ఆగ్రహించారు.ఇరువురూ దీనిపై చర్చించుకున్నారు. అధిష్ఠానం కూడా తీవ్రంగా స్పందించింది. జగన్ తో కేవీపీ రామచంద్రరావు బెంగుళూరులో మంతనాలు జరిపారు. ఆయన ఢిల్లీ నుంచి ఒక కవరు రావడంతో బెంగుళూరుకు వెళ్లినట్లు చెప్పారు. తాజా పరిణామాలతో జగన్ వర్గంపై అధిష్ఠానం ఆగ్రహం మరింత పెరిగింది. శరణు వేడితే తప్ప జగన్ కు సోనియా కటాక్షం లభించదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ చీలికకు ప్రయత్నాలు సాగుతున్నాయేమోనని అధిష్ఠానం అనుమానిస్తోంది. వరుస సంఘటనలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా విశ్వాసం కలిగించి, అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమనే వైఖరి ప్రదర్శిస్తేనే సోనియాను కలిసే అవకాశం దక్కుతుందనే అభిప్రాయంలో వున్నారు. మరోవైపు... రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి అయ్యేదాకా తన ప్రయత్నాలను కొనసాగించి తీరాలని జగన్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ రెండో తేదీ తర్వాత 'ఓదార్పు' పేరిట ఆయన జిల్లాల్లో పర్యటించాలని యోచిస్తున్నారు. అందులోనూ... తండ్రిలాగే 'చేవెళ్ల సెంటిమెంట్' పాటిస్తూ అక్కడినుంచే తన పర్యటనలు మొదలుపెట్టనున్నారు.


No comments:

Post a Comment